Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 22-NOV-2019

ప్రభువైన యేసు మేఘారూడుడై తిరిగి వచ్చుచున్నాడు

1థెస్స 4:13-19లో క్రీస్తు మరల వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో పౌలు చెప్పుచున్నాడు. ప్రభువులో నిద్రించిన వారి గూర్చి మీకు చెప్పకుండుట మాకు ఇష్టము లేదు. యేసులో నిద్రించిన వారి గూర్చి ఇక్కడ చెప్పబడింది. ప్రభువైనయేసు మృతిపొంది మరియు తిరిగి లేచాడు. అలాగే క్రీస్తులో మృతిపొందిన వారు కూడా తిరిగిలేస్తారు.

 ప్రభువైనయేసు వచ్చినప్పుడు ఆయనలో మృతిపొందిన వారి కంటే ముందుగా మనము ఎత్తబడము. సమాధులలో ఉన్న వారు మొదటిగా లేచెదరు. ఇది మొదటి పునరుత్థానము. మరియు ప్రభువును కలుసుకొనుటకు వారితో కూడా మనము తీసుకొనబడెదము. తరువాత వెయ్యి సంవత్సరముల వరకు అవిశ్వాసులు ఎత్తబడరు. వారు రెండవ పునరుత్థానములో లేపబడుదురు.

''ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును'' అప్పుడు ప్రభువును కలుసుకొనుటకు పరిశుద్ధులందరు మధ్య ఆకాశమునకు ఎత్తబడెదరు. తన రెండవ రాకడ గూర్చి తన శిష్యులకు చెప్పినప్పుడు ప్రభువు ఈ విషయము చెప్పారు.

 ''కాబట్టి ఎవరైనను - ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలిగదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి'' (మత్తయి 24:26). ఈనాడు కొందరు నమ్ముచున్నట్లుగా ఆయన రహస్యముగా రాడు. ''మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును'' ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది.

ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుందో? మహా శ్రమల తరువాతనే అని ప్రభువైనయేసు చెప్పారు (మత్తయి 24:29). శ్రమలకు ముందుగానే పరిశుద్ధులు ఎత్తబడతారని అనేకమంది నమ్ముచున్నారు. దానిని బోధించే ఒక్క వచనము కూడా లేదు. అది మనుష్యుల యొక్క సిద్ధాంతము. శ్రమల తరువాత వస్తానని ప్రభువే చెప్పారు. 1థెస్స 4:16,17లో చెప్పబడిన విషయములు మత్తయి 24:30,31లో ప్రభువైన యేసు స్పష్టముగా చెప్పారు. ''ఆయన గొప్ప బూరతో తన దూతను పంపును'' అప్పుడు పరిశుద్ధులు ప్రభువును కలుసుకొనుటకు ఎత్తబడుదురు.

1థెస్స 5:2లో రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చును. ఒక దొంగ ముందుగా చెప్పిరాడు. అదేవిధముగా ప్రభువు మరల వచ్చినప్పుడు ప్రతి అవిశ్వాసి ఆశ్చర్యపడతాడు. కాని వెలుగు సంబంధులు ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచున్నారు (1థెస్స 5:4). మనము చీకటిలో జీవించము. మనము ఆత్మీయముగా నిద్రించము గాని మెలకువగా ఉందుము (1థెస్స 5:6).

మనము మెలకువగా ఉన్నామా లేక నిద్రించుచున్నామా అని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి నిద్రించునప్పుడు తన చుట్టు జరుగుచున్న సంగతులను చూడలేడు. కాని కలలో నిజముకాని సంగతులు నిజమైనట్లు కనిపిస్తాయి. అలాగే విశ్వాసి ఆత్మీయముగా నిద్రించుచున్నప్పుడు నిజమైన నిత్యమైన సంగతులను చూడలేడు. మరియు నిజముకాని ఈ లోక సంగతులను నిజమైనట్టు చూస్తాడు. పరలోకముతోను మరియు నిత్యత్వముతోను పోలిస్తే, ఈ లోకములో ఉన్నదంతయు ఒక కలవలె ఉంటుంది.

పరలోక సంగతులు మాత్రము నిజముగా ఎన్నటికి నశించని నిత్యమైనవి. నిద్రించుచున్న విశ్వాసులకు, రాత్రివేళ దొంగవలె ప్రభువు వచ్చును. మనము ఆ దినము కొరకు ఎదురు చూస్తూ మరియు ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము. కాని లోకులు - నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని ఊహించుకుంటారు (1థెస్స 5:3). కాని ఆకస్మికముగా నాశనము వారికిక తటస్థించును.

గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము వారికి తటస్థించునని ఇక్కడ చెప్పబడింది (1థెస్స 5:3). అంత్యదినములలో ఇలాగే ఉంటుందని ప్రభువైనయేసు కూడా చెప్పారు (మత్తయి 24:8). ఒక బిడ్డను కనుటకు ముందుగా కొన్ని గంటలసేపు ప్రసవవేదన ఉంటుందని ప్రతి స్త్రీకి తెలియును (కొందరు తల్లుల నొప్పి మరణము పొందునంతగా ఉన్నది అని చెప్పుతారు). దాని తరువాతనే బిడ్డ పుడుతుంది. క్రీస్తు యొక్క రాకడ అలాగే ఉంటుంది.

 ప్రసవ వేదన లేకుండా బిడ్డ కూడా పుట్టదు. మరియు శ్రమలకు ముందుగానే ప్రభువు రాకడ ఉండదు. ఆ సమయము గూర్చి మనము భయపడము. ఆ సమయములో మనలను తన కొరకు సాక్షులుగా ఉంచుకొనుట మరియు సువార్త నిమిత్తము మన ప్రాణములను పెట్టుట మనకు గొప్ప ఘనతయైయున్నది.                                                               - జాక్‌ పూనెన్‌

Post a Comment

0 Comments